లక్నో: విద్యుత్ షార్ట్సర్క్యూట్ వల్ల ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు మరణించారు. (4 Children Dead In Fire accident) మహిళ పరిస్థితి సీరియస్గా ఉండగా ఆమె భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం పల్లవ్పురం ప్రాంతంలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
కాగా మంటల్లో కాలి గాయపడిన భార్యాభర్తలు జానీ, బబిత వారి నలుగురు పిల్లలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు చనిపోయినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బబిత పరిస్థితి సీరియస్గా ఉందని, ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్కు ఆమెను రిఫర్ చేసినట్లు చెప్పారు. భర్త జానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.