BJP | బెంగళూరు: ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తన పాలనలో మొత్తం 385 క్రిమినల్ కేసులను ఎత్తివేసిన విషయం బయటపడింది. ఇందులో 182 విద్వేష ప్రసంగాలు, గో సంరక్షకుల పేరుతో హింస, మత ఘర్షణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీటి నుంచి లబ్ధి పొందిన వారిలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
ఒక ఆంగ్ల పత్రిక హోం శాఖ నుంచి ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. బీజీపీ పాలనలో జూలై 2019 నుంచి ఏప్రిల్ 2023 వరకు 385 క్రిమినల్ కేసులు ఎత్తివేశారు. ఈ క్రిమినల్ కేసులపై విచారణ నిలిపివేయాలని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరి 2020 నుంచి ఫిబ్రవరి 2023 వరకు మొత్తం 7 ఉత్తర్వులను జారీ చేసింది. వీరిలో 182 కేసులలో మత ఘర్షణలు వంటి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు వెయ్యి మందికి పైగా ఉన్నారు.