బెంగళూరు : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఇటీవల దేశంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉండగా.. కర్నాటక బెంగళూరులో 24 గంటల్లో 31 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా తేలింది. న్యూ స్టాండర్డ్ పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎంఈఎస్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. విద్యార్థులకు వాక్సిన్ వేసే సమయంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. విద్యార్థులు వైరస్ బారినపడడంతో రెండు పాఠశాలలను శానిటైజ్ చేశారు.
బెంగళూరులో కొవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఆరోగ్య శాఖ పాఠశాలలు, కళాశాలలను ఆదేశించింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) సైతం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రోటోకాల్స్ను పాటించాలని ఆదేశించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు, సిబ్బందికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని, లక్షణాలుంటే వారికి కొవిడ్ పరీక్షలు చేయించాలని చెప్పింది. సిబ్బందికి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోస్ వేశారా? లేదా స్పష్టంగా తెలుసుకోవాలని ఆదేశించింది.