Double Engine | మోదీ సర్కారు పాలనలో సామాన్యుడికి పస్తులు ఉండే దుస్థితి దాపురించింది. గ్యాస్ధరలు తాళలేక పేదలు కట్టెల పొయ్యికి మళ్లారు. పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక చిన్న ఉద్యోగులు బస్సులు, లోకల్ ట్రైన్స్ బాటపట్టారు. అయితే, కడుపు నింపుకొనేందుకు మరో ప్రత్యామ్నాయం ఉండదు కదా. దీంతో పొదుపు ఖాతాల్లోని సొమ్మును తీసి, పిరమైనప్పటికీ నిత్యావసరాలను కొంటున్నారు. డబుల్ ఇంజిన్ అంటున్న బీజేపీకి ఓటేస్తే ట్రబుల్స్ ఖాయమని తెలంగాణవాదులు అంటున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు అసమర్థ విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ధరాఘాతం కునుకులేకుండా చేస్తున్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. పెరిగిన నిత్యావసరాల ధరలు అదనపు భారంగా మారాయి. పాలు, కూరగాయలు, బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, ఆలుగడ్డ, చింతపండు ఇలా ప్రతీదాని ధర ఆకాశాన్నంటుతున్నది. మొన్నటికి మొన్న టమోటా ధరలు గుండెల్లో గుభేలుపుట్టించగా, నిన్నటివరకూ ఉల్లి కన్నీళ్లు పెట్టించింది. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడిపై, రవాణా వ్యవస్థపై పడ్డది. ఆ ప్రభావం సరుకుల మీద పడ్డది. అంతిమంగా సామాన్యుడికే చేటు తీసుకొస్తున్నది.
ఎక్సైజ్ పన్నుపోటు
2014లో ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు గరిష్ఠంగా సుమారు 300 శాతం పెరిగినట్టు లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సాగుకు అవసరమైన ఉత్పాదక ఖర్చులు, డీజిల్ ధర పెంపుతో రవాణా చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరుగడంతో ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ సర్కారు పాలనలో డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం ఎక్సైజ్ పన్నులను పెంచినట్టు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) నివేదిక వెల్లడించింది.