BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్’లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ ఓ కథనాన్ని వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొంటున్న పాతిక మంది ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీలో చేరగానే కేసుల జాడ లేకుండాపోయిందని ఆ పత్రిక వెల్లడించింది. ఏకంగా 23 మందిపై కేసులు మూతబడటం లేదా ఆయా నేతలకు తాత్కాలికంగా ఊరట లభించినట్టు పేర్కొంది. ఈ మేరకు 2014-2024 మధ్య నమోదైన కేసుల వివరాలను ప్రచురించింది.
అజిత్ పవార్
పార్టీ మార్పు ఇలా: ఎన్సీపీ నుంచి ఎన్డీయే కూటమిలోకి (2023)
ఏమిటీ కేసు: మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అక్రమాల్లో పవార్ పాత్ర ఉన్నట్టు ఈడీ అభియోగం. 2023 జూలైలో ఎన్డీయే కూటమిలో చేరగానే, ఆరు నెలలకు కేసు మూసివేత.
ప్రతాప్ సర్నాయిక్
పార్టీ మార్పు ఇలా: శివసేన నుంచి ఎన్డీయే కూటమిలోకి (2022)
ఏమిటీ కేసు: ఓ సెక్యూరిటీ కంపెనీకి, సర్నాయిక్కు చెందిన కంపెనీలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయంటూ ఈడీ కేసు. 2022 జూన్లో ఎన్డీయే కూటమిలో చేరగానే, మూడు నెలలకు కేసు మూసివేత.
అశోక్ చవాన్
పార్టీ మార్పు ఇలా: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి (2024)
ఏమిటీ కేసు: ఆదర్శ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు పాల్పడినట్టు 2011లో సీబీఐ కేసు. 2024లో ఈయన బీజేపీలో చేరారు. అప్పటినుంచి కేసులో పురోగతిలేదు.
సువేందు అధికారి
పార్టీ మార్పు ఇలా: తృణమూల్ నుంచి బీజేపీలోకి (2020)
ఏమిటీ కేసు: నారద స్టింగ్ ఆపరేషన్కు సంబంధించి 2016లో సీబీఐ కేసు. 2020లో ఈయన బీజేపీలో చేరారు. అప్పటినుంచి కేసులో పురోగతిలేదు.
హిమంత బిశ్వశర్మ
పార్టీ మార్పు ఇలా: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి (2015)
ఏమిటీ కేసు: శారద చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించి 2014, 2015లో ఈడీ, సీబీఐ కేసులు. 2015లో ఈయన బీజేపీలో చేరారు. నాటి నుంచి అంటే 9 ఏండ్లుగా కేసులో పురోగతిలేదు.
ప్రఫుల్ పటేల్
పార్టీ మార్పు ఇలా: ఎన్సీపీ నుంచి ఎన్డీయే కూటమిలోకి (2023)
ఏమిటీ కేసు: ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ విలీనం, ఎయిరిండియా 111 విమానాల కొనుగోలులో విదేశీ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా యత్నించారంటూ ఈడీ, సీబీఐ కేసులు. 2023 జూలైలో ఎన్డీయే కూటమిలో చేరగానే, తొమ్మిది నెలలకు కేసు మూసివేత.
కోల్డ్స్టోరేజీలోకి చేరిన మరికొంతమంది నేతల కేసులు
హసన్ ముష్రిఫ్, భావన గవాలీ, యామినీ, యశ్వంత్ జాదవ్, సీఎం రమేశ్, రాణీందర్సింగ్, సంజయ్సేత్, కే గీత, సోవన్ ఛటర్జీ, ఛాగన్ భుజ్బాల్, కృపాశంకర్ సింగ్, దిగంబర్ కామత్, నవీన్ జిందాల్, తపస్ రాయ్, అర్చన పాటిల్, గీతా కోడ, బాబా సిద్ధిఖీ, జ్యోతిమిర్ధా (కేసు కొనసాగుతున్నది), సుజనా చౌదరీ (కేసు కొనసాగుతున్నది).
అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని 2014 నుంచి ఇప్పటివరకూ బీజేపీలో చేరిన ప్రముఖ నాయకులు 25
శాశ్వతంగా మూసివేసిన కేసులు- 3
తాత్కాలికంగా కోల్డ్స్టోరేజీలో పెట్టిన కేసులు- 20
ఈ ఒక్క ఏడాదే బీజేపీలో చేరిన నాయకుల సంఖ్య- 6
విపక్ష నేతలపై ఈడీ నమోదు చేసిన కేసులు- 95%
ఈడీ రాడార్లో ఉన్న ప్రముఖ నాయకుల సంఖ్య- 121
ఇందులో విపక్షాలకు చెందిన వారి సంఖ్య- 115