బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల లోపు వయసువారేనని గ్రేటర్ బెంగళూరు నగర పాలిక అధికారులు తెలిపారు. 9 ఏండ్ల లోపు చిన్నారులు 106 మంది, 9-19 ఏండ్ల వయసు పిల్లలు 136 మంది ఉన్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింత మంది పిల్లలకు కరోనా సోకే అవకాశమున్నదని, కేసుల సంఖ్య మూడు రెట్లు పెరుగవచ్చని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పిల్లలను బయట తిరుగనీయవద్దని, తల్లిదండ్రులు కరోనా నియమాలు పాటించాలని ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి సూచించారు.
మరోవైపు కర్ణాటకలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొందరు నిఫుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కరోనా నిబంధనలు కఠినతరం చేసింది. అన్ని జిల్లాల్లో రాత్రిపూట, వారాంతరాల్లో కర్ఫ్యూ విధించింది. మహారాష్ట్ర, కేరళ సరిహద్దుల నుంచి ప్రవేశాలపై ఆంక్షలు విధించింది. 72 గంటల ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ చూపించని వారిని రాష్ట్రంలోకి అనుమతించవద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్ట్ 16 నుంచి కర్ణాటకలో పాక్షిక లాక్డౌన్ అమలు చేయవచ్చని తెలుస్తున్నది.