Heavy Rains | ఉత్తర భారతదేశాన్ని (North India) భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. యమున సహా పలు నదులు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో వరద పోటెత్తి పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి.
వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్ లో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. యూపీ, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
ముఖ్యంగా గత రెండు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురిసిన వర్షానికి బియాస్ నది సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నీరంతా గ్రామాల్లోకి చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీ (Manali)లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ఉద్ధృతికి దుకాణాలు, కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో మరో టూరిస్ట్ స్పాట్ కులూలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మండీ జిల్లాలోనూ పరిస్థితులు బాగోలేవు. అక్కడ వరద ఉద్ధృతికి ఓ ఉక్కు వంతెన కొట్టుకుపోయింది.
హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో 700 రహదారులను మూసివేశారు. మరోవైపు చండీగఢ్, హరియాణా రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చండీగఢ్ లో ఇప్పటి వరకు 322.2 మి.మీ, హరియాణాలోని అంబాలాలో 224.1 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ హిమాలయ ప్రాంతం, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక పశ్చిమ భారతదేశం, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ లోని ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.
‘రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయి. జులై 10న జార్ఖండ్, జులై 12 మధ్య బీహార్ లోని అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయి’ అని ఐఎండీ తెలిపింది.
మరోవైపు మధ్యప్రదేశ్ లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదేవిధంగా దక్షిణ భారతదేశం కోస్తా కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీలోపాటు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు నగరంలో యమునా (Yamuna River) నదికి వరద (Floods) పోటెత్తింది. నదిలో వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. అయితే హస్తినకు మరో ముప్పు పొంచిఉన్నది. రెండు రోజుల్లో ఢిల్లీని భారీ వరద తాకనుంది. ఇప్పటికే రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వీటికి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చే వరద తోడవనుంది.
కాగా, దేశ రాజధానిలో 41 ఏండ్ల గరిష్టస్ధాయిలో వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153ఎంఎం వర్షపాతం నమోదవడంతో 1982 తర్వాత ఈ స్ధాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వర్షాకాలం సీజన్లో ఢిల్లీలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాలని ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Delhi | ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు.. హస్తినకు పొంచి ఉన్న మరో ముప్పు
TS Weather | రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు
Malaria | 20 ఏండ్ల తర్వాత అమెరికాలో మలేరియా కేసులు.. కారణమిదేనట