భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మూడేళ్లకు కేవలం 21 మంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. అయితే ఒక్కో వ్యక్తి నియామకానికి ఏకంగా సుమారు రూ.80 లక్షలు చొప్పున మొత్తం రూ.16.74 కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవరం జాతవ్ అసెంబ్లీలో అడిగిన ఒక ప్రశ్నకు బీజేపీ మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని 52 జిల్లాల్లో ఉన్న ఉపాధి కార్యాలయాల నిర్వహణకు 2020 ఏప్రిల్ 1 నుంచి మూడేళ్లలో సుమారు రూ.16.74 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆయా ఉపాధి కార్యాలయాల్లో 37,80,679 మంది విద్యావంతులు, 1,12,470 మంది చదువుకోని వారు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. అయితే సుమారు 39 లక్షల నిరుద్యోగుల్లో కేవలం 21 మంది దరఖాస్తుదారులకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ కార్పొరేషన్లలో ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు.
కాగా, లక్షలాది మందికి ఉద్యోగం కల్పిస్తామంటూ మధ్యప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీ నెరవేర్చడంలో విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉద్యోగాల కల్పన ఈ తీరున ఉండటంతో భోపాల్లోని ప్రధాన ఉపాధి కార్యాలయం, ఇతర జిల్లాల కార్యాలయాలు బోసి పోతున్నాయని ఆరోపించింది. వాటి నిర్వాహణకు కోట్లలో వ్యయం చేసే బదులు మూసివేయడం మంచిదని ఎద్దేవా చేసింది. మధ్యప్రదేశ్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్నది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని, శాంతి భద్రతలు లోపించాయని విమర్శించింది.
Also Read: