చెన్నై: దేశంలో హెచ్3ఎన్2 వైరస్ విజృంభిస్తున్నది. (H3N2 Virus Spike) ఈ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇన్ఫ్లుఎంజా కేసుల తీవ్రత పెరిగింది. హెచ్3ఎన్2 వైరస్కు సంబంధించి 79 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నుంచి అన్ని స్కూళ్లను 11 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 26 వరకు స్కూళ్లు మూసి ఉంటాయని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు.
కాగా, ప్రజలు భయాందోళన చెందవద్దని పుదుచ్చేరి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జీ శ్రీరాములు తెలిపారు. పెరుగుతున్న ఇన్ఫ్లుఎంజా కేసులను నియంత్రించేందుకు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆసుపత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాల్లో (ఓపీడీ) కూడా ప్రత్యేక బూత్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇన్ఫ్లుఎంజా వైరస్ లక్షణాలున్న వారికి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా అన్ని నివారణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం సిఫార్సు చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని ప్రజలను కోరారు. చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్క్లు ధరించడం, రద్దీ ప్రాంతాల్లో తిరుగకుండా ఉండటం వంటిని పాటించాలని సూచించారు.