న్యూఢిల్లీ: ఇద్దరి భార్యలతో (Two Wives) గడిపేందుకు ఒక వ్యక్తి వారిద్దరికీ సమానంగా సమయం కేటాయించాడు. వారానికి మూడు రోజు ఒక భార్యా పిల్లలతో, మరో మూడు రోజులు మరో భార్యా పిల్లలతో ఉండేలా ఒప్పందం చేసుకున్నాడు. వారంలో మిగిలిన ఒక రోజు మాత్రం అతడి కోసం కేటాయించుకున్నాడు. ఆదివారం ఏ భార్య వద్ద ఉండాలో అన్నది అతడి ఇష్టం. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాడు. విస్తూ పోయే ఈ సంఘటన ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. వృత్తిరిత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఒక వ్యక్తికి 2018లో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన మహిళతో పెళ్లి జరిగింది. వారికి ఒక బాబు పుట్టాడు.
కాగా, 2020లో కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలో భార్యను ఆమె పుట్టింటికి పంపాడు. గురుగ్రామ్లోని అపార్ట్మెంట్లో ఒంటరిగా అతడు ఉన్నాడు. ఈ సమయంలో కంపెనీకి చెందిన సహోద్యోగినితో అతడికి సంబంధం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి సహజీవనం చేశారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప జన్మించింది.
మరోవైపు పుట్టింట్లో ఉంటున్న మొదటి భార్యకు ఈ విషయం తెలిసింది. ఏడాది తర్వాత ఆమె గురుగ్రామ్ వెళ్లి భర్తను నిలదీసింది. ఆ తర్వాత కోపంతో మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని పుట్టింటికి తిరిగి వెళ్లింది. భర్తకు వ్యతిరేకంగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఇద్దరి భార్యలకు పిల్లలు ఉన్నందున ఈ సమస్యను పరిష్కరించి వారి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను కౌన్సిల్ న్యాయవాదికి కోర్టు అప్పగించింది.
ఈ నేపథ్యంలో న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ హరీష్ దేవాన్ ఆ వ్యక్తితో చర్చించాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం నేరమని చెప్పాడు. భార్య ఫిర్యాదు చేస్తే అతడి ఉద్యోగం కూడా పోతుందని హెచ్చరించాడు. దీంతో ఆ వ్యక్తి, ఇద్దరు భార్యలు ఒక ఒప్పందానికి వచ్చారు. ఇద్దరి భార్యలకు సమానంగా సమయం కేటాయించేందుకు భర్త ఒప్పుకున్నాడు. వారంలో మొదటి మూడు రోజులు ఒక భార్యా పిల్లలతో, మరో మూడు రోజులు మరో భార్యా పిల్లలతో ఉండేందుకు అంగీకరించాడు. మిగిలిన ఒక రోజైన ఆదివారం ఏ భార్య వద్ద ఉండాలో అన్నది అతడి ఇష్టం.
ఇలా రోస్టర్ విధానం ప్రకారం ఇద్దరి భార్యలతో కలిసి కాపురం చేసేందుకు కోర్టు బయట ఆ వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇద్దరి భార్యలను గురుగ్రామ్లో రెండు అపార్ట్మెంట్లలో ఉంచేందుకు కూడా అంగీకరించాడు. ఈ ఒప్పందాన్ని అతడు ఉల్లంఘిస్తే మొదటి భార్య కోర్టును ఆశ్రయించవచ్చని ఆ న్యాయవాది తెలిపారు.
Also Read: