Thaman | అక్కినేని అఖిల్ కెరీర్లో ఎంతోకాలం తర్వాత భారీ విజయాన్ని అందించిన చిత్రం ‘లెనిన్’. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కథ, భావోద్వేగాలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అఖిల్ కెరీర్లో ఈ సినిమా కీలక మైలురాయిగా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు ఎస్. థమన్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘లెనిన్’లో మొదట ఓ ప్రత్యేక ఐటెం సాంగ్ను ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే కథకు అది అవసరం లేదని భావించిన చిత్రబృందం చివరికి ఆ ఆలోచనను పూర్తిగా విరమించుకుందని వెల్లడించారు.
థమన్ మాట్లాడుతూ.. సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేశాం. కానీ అది కథనం ప్రవాహానికి సరిపోవడం లేదని మేకర్స్ భావించారు. షూటింగ్ ప్రారంభం కాకముందే ఆ పాటను పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. కథకు అవసరం లేని అంశాన్ని బలవంతంగా జోడిస్తే ప్రేక్షకుల నుంచి అనవసర విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించాం అని తెలిపారు. ఆ పాట చిత్రీకరణకు ముందే ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ కావడం తనను నిరాశకు గురి చేసిందని థమన్ వెల్లడించారు. ఆ విషయం తెలిసిన తర్వాత తాను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి విషయాలు బయటకు రావడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
థమన్ వెల్లడించిన మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, కయాడు లోహర్, ప్రీతి ముఖుందన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరికి ఆ పాటనే పూర్తిగా రద్దు చేయడంతో ఆ ఆలోచన అక్కడితో ముగిసిపోయిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు.. ఒకవేళ ఆ స్పెషల్ సాంగ్ తెరకెక్కి ఉంటే ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన అనంతరం ‘లెనిన్’ త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం వచ్చే వారం నుంచి జీ5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.