Assam voter list : అసోంలో 2.4 లక్షల ఓట్లను తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అసోంలో ఎన్నికల సంఘం స్పెషల్ రివిజన్ (ఎస్ఆర్) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఆర్ నిర్వహించి తాజా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,49,58,139 మంది ఓటర్లున్నారు.
ఇంతకుముందు ఉన్న 2,52,01,624 మంది ఓటర్లలోంచి 2,43,485 మందిని తొలగించింది. తాజా జాబితా ప్రకారం అసోంలో 1,24,82,213 మంది పురుష ఓటర్లు, 1,24,75,583 స్త్రీ ఓటర్లు, 343 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొదట ఇంటిగ్రేటెడ్ ఓటర్ల జాబితాను గత ఏడాది డిసెంబర్ 27న ప్రకటించారు. అంతకుముందు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు ఇంటింటికీ తిరిగి ఓటర్ జాబితా సర్వే నిర్వహించారు. ఇందులో సరైన ధృవపత్రాలు లేని వారు, మరణించిన వారు, అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నవారి పేర్లను జాబితా నుంచి తొలగించారు.
డిసెంబర్ 27న డ్రాఫ్ట్ ప్రకటించిన తర్వాత మార్పులు, చేర్పులు, అభ్యంతరాలకు ఓటర్లకు జనవరి 22 వరకు సమయమిచ్చారు. ఈ లోపు వచ్చిన ఫిర్యాదులు అన్నీ పరిష్కరించి తాజాగా తుది జాబితా విడుదల చేశారు. వచ్చే మార్చి-ఏప్రిల్లో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓట్ల విషయంలో ఈసీ కీలకంగా వ్యవహరిస్తోంది.