జమ్ము, జనవరి 27: దొడ్డిదారిలో సరిహద్దుల గుండా భారత్లోకి చొచ్చుకువచ్చి తరుచూ దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు పంథా మార్చుకున్నారు. డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత సాయంతో దాడులకు కుట్ర పన్నుతున్నారు. జమ్ము విమానాశ్రయంలోని వాయుసేన కార్యకలాపాలు నిర్వహించే స్థావరంలో పేలుడు కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు డ్రోన్లు ఆరు నిమిషాల వ్యవధిలో వాయుసేన స్థావరం మీదకు పేలుడు పదార్థాలను (ఐఈడీ) జారవిడిచినట్టు అధికారులు తెలిపారు. తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై-సెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలోని ఒక బిల్డింగ్ పైకప్పు దెబ్బతినగా, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులు స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు. భారత్లో జరిగిన తొలి డ్రోన్ దాడి ఇదేనని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఘటన జరిగిన స్థలం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వైస్ ఎయిర్ చీఫ్, ఎయిర్ మార్షల్ అరోరాతో మాట్లాడారు. కాగా పేలుళ్లలో ఆయుధ సామగ్రి, చాపర్లకు ఎలాంటి నష్టం జరుగలేదని వాయుసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. జమ్ములో దాడి నేపథ్యంలో పంజాబ్ సరిహద్దుల్లోని పఠాన్కోట్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
ఉగ్రవాదుల పనే..
వాయుసేన స్థావరంలో జరిగిన దాడి ఉగ్రవాదుల పనేనని జమ్ముకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. దాడి వెనుక ఎవరున్నారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఈ దాడి వెనుక పాకిస్థాన్కు చెందిన లష్కరే తాయిబా లేదా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉండొచ్చని భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.
టార్గెట్ అవే!
విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) బిల్డింగ్, విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఎంఐ17 చాపర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ డ్రోన్ దాడులు జరిగినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, కొన్ని కారణాల వల్ల టార్గెట్ మిస్ అయినట్టు వెల్లడించాయి. అయితే ఒక పేలుడు ఏటీసీకి కేవలం 100 మీటర్ల దూరంలోనే జరుగడం గమనార్హం. దాడికి పాల్పడిన డ్రోన్లలో ఒక డ్రోన్ 5 కిలోల టీఎన్టీ బాంబును కలిగి ఉన్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
మరో కుట్ర భగ్నం
ఒకవైపు వాయుసేన స్థావరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు జమ్ములోని జనసమ్మర్ధం ఎక్కువగా ఉ న్న ప్రాంతాల్లో పేలుడుకు కుట్రపన్నారు. అయితే, దీ న్ని పోలీసులు భగ్నం చేశారు. 6 కిలోల పేలుడు పదార్థాలు కలిగి అనుమానాస్పదం గా సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రత్యేక పోలీస్ అధికారి ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య మరణించారు. కుమార్తెకు గాయాలయ్యాయి.