న్యూఢిల్లీ : గతేడాది 2022 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో 187 ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. ఉగ్రవాదుల నిర్మూలనకు తీసుకున్న చర్యలను మంత్రి రాజ్యసభకు వివరించారు. కశ్మీర్లో 111 యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే 2022లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య 117 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. 2021లో జమ్మూ కాశ్మీర్లో 180 మంది ఉగ్రవాదులను హతమార్చామని, 95 యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు నిర్వహించామని పేర్కొన్నారు. 2021లో మొత్తం వంద ఎన్కౌంటర్లు, 129 ఉగ్రవాద ఘటనలు రికార్డయ్యాయని పేర్కొన్నారు.