మద్రాస్: తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో మొత్తం కరోనా కేసులు 30కి చేరాయి. కొత్తగా కరోనా సోకినవారంతా హాస్టల్లో ఉండేవారేనని అధికారులు తెలిపారు. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా క్యాంపస్ మొత్తం శానిటైజేషన్ చేశారు. క్యాంపస్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధా కృష్ణన్ ఆందోళన వ్యక్తంచేశారు. పాజిటివ్ వచ్చిన కేసులను పరిశీలిస్తే 90 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్లో బీఏ.2 రకానికి చెందినవిగా నిర్ధారణ అయ్యాయని చెప్పారు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శుక్రవారం 2451 మంది వైరస్ బారిన పడ్డారు. యాక్టివ్ కేసులు 14241కి చేరాయి. కరోనా వల్ల ఇప్పటివరకు 5,22,116 మంది బాధితులు చనిపోయారు. కేసులు అధికమవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.55 శాతానికి చేరిందని కేంద్ర వైద్యశాఖ తెలిపింది.