రాజౌరి, నవంబర్ 22: జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందటంతో ఆదివారం నుంచి సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి. దట్టమైన అడవిలో నక్కి ఉన్న ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఇద్దరు కెప్టెన్లు, ఒక హవల్దార్, ఒక జవాన్ వీరమరణం పొందినట్టు అధికారులు వెల్లడించారు. మరో మేజర్, జవాన్ గాయపడినట్టు తెలిపాయి. బాజిమాల్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు వివరించాయి.
ఈ ఘటన తర్వాత భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో బలగాల్ని ఘటనా స్థలానికి పంపింది. అటవీ ప్రాంతంలో నక్కివున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నది. గ్రామానికి అత్యంత సమీపంలో కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని పోలీసులు చెప్పారని గ్రామస్థులు తెలిపారు. పిర్ పంజాల్ అటవీ ప్రాంతం గత కొన్నాండ్లుగా సైన్యానికి సవాల్గా మారింది. ఉగ్రమూకలు ఇక్కడి దట్టమైన అడవుల్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 17న భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఏప్రిల్ 20, మే 5న పూంఛ్, రాజౌరీ జిల్లాలోని మెంధార్, కాండీ అడవుల్లో జరిగిన కాల్పుల్లో 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్ముకశ్మీర్లో ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 120 మంది చనిపోగా, అందులో 81 మంది ఉగ్రవాదులు, 26 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. జమ్ము రీజియన్లో 46 మంది చనిపోయారు.