భోపాల్: మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.