కోల్కతా: రైలులో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను రైల్వే పోలీసులు గుర్తించారు. మహిళలు, పిల్లలతో సహా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులు నకిలీ అని నిర్ధారించారు. (Bangladeshi Nationals Arrested) పశ్చిమ బెంగాల్లోని జలపాయ్గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ వెళ్తున్న నార్త్ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో కొందరు అనుమానిత వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు సమాచారం అందింది. దీంతో జలపాయ్గురి రోడ్డు స్టేషన్లో ఆ రైలును రైల్వే పోలీసులు తనిఖీ చేశారు.
కాగా, అనుమానిత వ్యక్తులుగా కనిపించిన 14 మందిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. వారిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు.
మరోవైపు వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులు నకిలీ అని రైల్వే పోలీసులు నిర్ధారించారు. దీంతో నకిలీ ఆధార్ కార్డులతో పాటు వారి వద్ద ఉన్న మలేషియా కరెన్సీ, మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. పని కోసం జమ్ము కశ్మీర్ వెళ్తున్నట్లు వారు చెప్పారని రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. వారి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Guests Assault Bride, Groom | మద్యం ఇవ్వలేదని.. వధూవరులపై పెళ్లి అతిథుల దాడి
Woman sacrificed daughter | కుమారుడి ఆరోగ్యం కోసం.. కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?