Sand Tractors | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-గ్వాలియర్ జాతీయ రహదారిపై 13 గంధం చెక్కలతో కూడిన ట్రాక్టర్లు టోల్ ప్లాజా వద్ద బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ వెళ్లిపోయాయి. టోల్ ప్లాజా వర్కర్లు ఆ ట్రాక్టర్లను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆగ్రా గ్వాలియర్ హైవేపై జాజావు టోల్ప్లాజా వద్ద జరిగిన ఘటనలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని యూపీలో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టోల్ ప్లాజా వద్ద చార్జీ చెల్లించకుండానే తొలి ట్రాక్టర్.. బ్యారికేడ్ను బ్రేక్ చేస్తూ దూసుకెళ్లింది. దాని వెంట మరో 12 ట్రాక్టర్లు ఎక్కడ ఆపకుండా దూసుకెళ్లాయి. 13 ట్రాక్టర్లు కూడా కేవలం 53 సెకన్లలోనే టోల్ ప్లాజాను దాటి పోవడం గమనార్హం. ఈ ఘటనపై ఆగ్రా పోలీసులు సాయియాన్, ఖేరాగఢ్ పోలీస్ స్టేషన్లలో మూడేసి కేసులు నమోదు చేశారు. మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్-1957తోపాటు ఐపీసీలోని 307తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టోల్ ప్లాజా వద్ద, ఇతర ప్రాంతాల్లో ఆయా ట్రాక్టర్లను ఆపేందుకు టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ప్రయత్నించారు. ట్రాక్టర్తోపాటు ఉన్న రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లా వాసి కాంపౌండర్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.