ప్రధాని మౌనంపై 13 విపక్ష పార్టీల ధ్వజం
మతసామరస్యం పాటించాలని ప్రజలకు పిలుపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో మతహింసను ప్రేరేపించేలా, సమాజంలో చిచ్చురేపేలా పలువురు చేస్తున్న ప్రసంగాలు, జరుగుతున్న ఘటనల పట్ల ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి. అధికార పార్టీ అండతోనే ప్రైవేటు సాయుధ మూకలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయనే దానికి ప్రధాని మౌనమే సాక్ష్యమని పేర్కొన్నాయి.
ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఎన్సీపీ అధినేత శరద్పవార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమత, స్టాలిన్, హేమంత్ సోరెన్, పలు వామపక్షాలతో సహా 13 ప్రతిపక్ష పార్టీల నేతలు శనివారం ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న మతపరమైన ఘర్షణలు, విద్వేష ప్రసంగాల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, మత సామరస్యాన్ని పాటించాలని.. విద్వేష శక్తుల కుట్రలను, దుష్ట లక్ష్యాలను విఫలం చేయాలని ప్రజలను కోరారు.