న్యూఢిల్లీ, జూలై 10: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ర్టాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ఐదు రోజులపాటు దేశ మధ్య, పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం పేర్కొన్నది. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నది. మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలో 9 మంది మరణించారని అధికారులు ఆదివారం ప్రకటించారు.
విదర్భ రీజియన్ జిల్లాల్లో రెడ్అలర్ట్
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ విభాగం హెచ్చరించింది. విదర్భ రీజియన్లోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలకు రెడ్ అలర్ట్, నాగపూర్, యవత్మాల్తో పాటు పలు ఇతర జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీచేసింది. తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆదివారం పేర్కొన్నది. ఎడతెరిపిలేని వానల కారణంగా గడ్చిరోలిలో వరదలు తీవ్రమయ్యాయి. 128 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
కర్ణాటకలో పలు జిల్లాలకు రెడ్అలర్ట్
కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక, ఉడుపి జిల్లాల్లో బుధవారం వరకు రెడ్అలర్ట్ జారీచేశారు. ఉడుపి, కొడగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. కాలీ నదిలో నీటి మట్టం మూడు అడుగులు పెరిగింది.
కేరళలో మరో నాలుగు రోజులు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కేరళలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరో నాలుగు రోజులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్ జిల్లాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
గుజరాత్లోని నదుల్లో పెరిగిన నీటిమట్టం
దక్షిణ, మధ్య గుజరాత్లో భారీ వర్షాలు కురిశాయి. ఒర్సాంగ్, అంబికా నదుల్లో నీటిమట్టం పెరిగింది. నవ్సారీ, వల్సాద్, దంగ్ జిల్లాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
హిమాచల్ప్రదేశ్ 12 జిల్లాల్లో హైఅలర్ట్
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల అధికారులను అలర్ట్ చేసింది.
అస్సాంలో వరదలు తగ్గుముఖం
అస్సాంలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకా వరదల కారణంగా రాష్ట్రంలో 6 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని ఎస్డీఆర్ఎఫ్ తెలిపింది.