న్యూఢిల్లీ, డిసెంబర్ 21: చైనా అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్రం సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి. అరుణాచల్ప్రదేశ్లో ఇరు దేశాల బలగాల మధ్య చోటుచేసుకొన్న ఘటనపై లోక్సభలో చర్చకు ఒప్పుకోకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. బుధవారం జీరో అవర్ సందర్భంగా.. సరిహద్దు సమస్యపై చర్చ కోరటం ప్రతిపక్షాల హక్కు అని, దానిపై చర్చకు అనుమతించాలని కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అందుకు స్పీకర్ ఒప్పుకోకపోవటంతో విపక్షాలన్నీ సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ కాంప్లెక్స్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి. ఈ నిరసనలో దాదాపు 12 పార్టీలు పాల్గొన్నాయి.