West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. బాంబు దాడులు, బుల్లెట్ల వర్షంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో 12 మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు, ఒకరు బీజేపీ కార్యకర్త, మరొకరు సీపీఎం పార్టీకి చెందిన కార్యకర్త ఉన్నారు. మిగతా ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆయా పార్టీల మధ్య నెలకొన్న ఘర్షణలను నిలువరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కేంద్ర బలగాలను భారీ మోహరించారు. అల్లరి మూకలు, ఆందోళనకారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు మూడంచెల భద్రత కల్పిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 5.67 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చాలా మంది ఓటు వేశారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 22 జిల్లాల్లోని 63,229 గ్రామ పంచాయతీలకు, 9,730 పంచాయతీ సమితిలకు, 20 జిల్లాల్లోని 928 జిల్లా పరిషత్లకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.