Air India Pilots | గతనెల 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.
అయితే, ఈ ప్రమాదం జరిగిన అనంతరం దాదాపు వంద మందికిపైగా ఎయిర్ ఇండియా పైలట్లు (Air India Pilots) సిక్ లీవ్ పెట్టినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మరళీధర్ మొహల్ పార్లమెంట్కు తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత 112 మంది సిక్లీవ్పై వెళ్లినట్లు వెల్లడించారు. 51 మంది కమాండర్లు, 61 మంది ఫ్లైట్ ఆఫీసర్లు సెలవుల కోసం అప్లై చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంత భయంకరమైన ప్రమాదం తర్వాత వారి మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి నొక్కిచెప్పారు.
ఎయిర్ ఇండియాకు నాలుగు షోకాజు నోటీసులు..
విమాన ప్రమాదం అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు చేపట్టింది. విమాన ప్రయాణాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాకు తాజాగా నాలుగు షోకాజు నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా అంగీకరించినట్లు సమాచారం. భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు డీజీసీఏ తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ ఇటీవల రాజ్యసభకు తెలియజేసింది. ఉల్లంఘనలకు సంబంధించి తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read..
Free Trade Agreement | భారత్-యూకే మధ్య కీలక ట్రేడ్ డీల్.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు
Parliament Session | నాలుగోరోజూ సాగని చర్చ.. ఉభయ సభలు రేపటికి వాయిదా
Donald Trump: ఇండియన్ టెకీలను తీసుకోవద్దు.. గూగుల్, మైక్రోసాఫ్ట్కు ట్రంప్ ఆదేశాలు !