Womens Safety | నిర్భయ చట్టాలు తీసుకొచ్చినా.. ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా.. మహిళలపై దాడులు తగ్గడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మహిళలపై దాడులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది జూలై 15 వరకు 1100 మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. గతేడాది 1033 లైంగిక దాడి ఘటనలో చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో 13 ఏండ్ల బాలికపై ఎనిమిది మంది దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారిలో ఒకరు జువైనల్ కావడం గమనార్హం. ఈ ఘటనతో ఢిల్లీలో మహిళల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. తొలుత సదరు బాలికను మే 18న కిడ్నాప్ చేసి.. మత్తుమందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడి చేశారు. అటు పై మరికొందరు చేసిన ఈ దుర్మార్గం మానవత్వం అనే పదానికి హద్దులు చెరిపేసింది. వారం రోజుల పాటు ముష్కరుల దాడిలో తీవ్రంగా గాయపడిందా బాధితురాలు. ఏప్రిల్ 24న మిస్సింగ్ అయిన సదరు బాలిక మే 2న సాకేత్ మెట్రో స్టేషన్ వద్ద స్పృహ లేని స్థితిలో దొరికింది. దేశ రాజధానిలో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
షాహ్దరాలోని కస్తూర్బా నగర్ ప్రాంతంలో ఒక మహిళపై జనవరి 26న జరిగిన సామూహిక దాడి ఘటన జరిగింది. ఈ ఘటనలో మహిళతోపాటు మరికొందరు ఆమె వెంటుకలు గొరిగి, అర్ధనగ్నం చేసి, ముఖానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండతో ఊరేగించిన ఘటన వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ ఘటనలో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.48 శాతం దుర్ఘటనలు పెరిగాయి.
మహిళలపై దాడులు కేసులు గతేడాది 1244 జరిగితే, ఈ ఏడాది 1480 ఘటనలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో ఈ ఏడాది దాదాపు 2,200 మంది మహిళలు కిడ్నాపయ్యారు. గతేడాది 1880 మంది కిడ్నాపయ్యారు. 2021లో మొత్తం 3758 మంది మహిళలను అపహరించుకుపోయారు. దీంతో మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనం బయటపడుతున్నది.
మహిళలపై భర్తలు, అత్తింటివారి దాడుల కేసులు దాదాపు 30 శాతం పెరిగాయి. గతేడాది ఆరు నెలల్లో 2096 మంది మహిళలపై భర్తలు, అత్తింటివారు వేధింపులకు పాల్పడితే, ఈ ఏడాది 2704 మందికి చేరింది. వరకట్నం వేధింపులతో 2021లో 72 మంది మరణిస్తే, ఈ ఏడాది 69కి చేరింది. మొత్తం మహిళలపై దాడులు గత ఆరు నెలల్లో 6,747 నుంచి 7887 పెరిగాయి. ఢిల్లీలో మహిళలపై దాడులు, వేధింపుల ఘటనలు 17 శాతం పెరిగిపోయాయి.