అహ్మదాబాద్ : గుజరాత్లో (Gujarat) నవరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గర్భా పెర్ఫామ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పది మంది గుండెపోటుకు గురై మరణించడం ఆందోళన రేకెత్తించింది. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్యవయసు వారు ఉన్నారు. బరోడాలోని దభోయ్కు చెందిన 13 ఏండ్ల బాలుడు కూడా గర్భా వేడుకలో గుండెపోటు రావడంతో కన్నుమూశాడు.
గర్భా ఆడుతూ కపద్వంజ్లో 17 ఏండ్ల యువకుడు కుప్పకూలాడు. గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులకు 521 కాల్స్ రాగా, శ్వాస సంబంధిత సమస్యలతో 609 కాల్స్ వచ్చాయి. ఈ కాల్స్ అన్నీ గర్భా వేడుకలు జరిగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్యే రావడం గమనార్హం. ఈ ఘటనలు ప్రభుత్వంతో పాటు ఈవెంట్ నిర్వాహకులు అప్రమత్తం కావాలనే హెచ్చరిక పంపుతున్నాయి.
గర్భా వేదికలకు సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎమర్జెన్సీ కేసుల విషయంలో సత్వరమే స్పందించేందుకు అంబులెన్స్లు వేగంగా వచ్చేందుకు కారిడార్స్ ఏర్పాటు చేయాలని కోరింది. మరోవైపు గర్భా వేదికల వద్ద వైద్యులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వాహకులు చర్యలు చేపుతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులను అధికారులు కోరుతున్నారు. మంచినీరు వంటి ప్రాధమిక సౌకర్యాలను అందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు.
Read More :
BJP | ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. 52 మందితో తొలి జాబితా