Madhya Pradesh Assembly Elections | కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తుంటాయి. తీరా సమయం వచ్చినప్పుడు మాత్రం ‘తప్పు’లో కాలేస్తుంటాయి. దీనికి నిదర్శనం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో పది మంది మాజీ ముఖ్యమంత్రుల వారసులే ఉన్నారు. ఐదుగురు మాజీ సీఎంల కొడుకులు, ఇద్దరు మేనల్లుళ్లు, ఒక సోదరుడు, ఒక మనుమడు, ఒక కోడలు ఉన్నారు. వారిలో మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఆరుగురు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు మాజీల వారసులే.
మధ్యప్రదేశ్ ఆరో ముఖ్యమంత్రి గోవింద్ నారాయణ్ సింగ్ తనయుడు ధ్రువ్ నారాయణ్ సింగ్, మనుమడు విక్రం సింగ్ పోటీలో ఉన్నారు. భోపాల్ నుంచి ధ్రువ్ నారాయణ్ సింగ్, సాత్నా జిల్లా రాంపూర్-బాఘేలాన్ స్థానం నుంచి విక్రమ్ సింగ్ బరిలోకి దిగుతున్నారు. మధ్యప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి వీరేంద్ర కుమార్ సాఖ్లేచ తనయుడు ఓం ప్రకారం సఖ్లేచ- నీమూచ్ జిల్లా జవాడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (12వ) సుందర్ లాల్ పఠ్వా మేనల్లుడు సురేంద్ర పఠ్వా – రైసెన్ జిల్లా భోజ్ పూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మరో మాజీ సీఎం (22వ) ఉమా భారతి మేనల్లుడు రాహుల్ సింగ్ లోధీ – తికంఘఢ్ జిల్లా ఖర్గాపూర్ స్థానం నుంచి బరిలో నిలిచారు. రాష్ట్ర 23వ సీఎం బాబూలాల్ గౌర్ కోడలు క్రుష్ణ గౌర్.. భోపాల్ జిల్లా గోవింద్ పుర స్థానంలో పోటీ చేస్తున్నారు.
10వ ముఖ్యమంత్రి కైలాశ్ జోషి తనయుడు దీపక్ జోషి.. దేవాస్ జిల్లా ఖాటేగావ్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. అలాగే 13వ సీఎం అర్జున్ సింగ్ కొడుకు అజయ్ సింగ్ రాహుల్.. సాత్నా జిల్లా చురాహత్ స్థానంలో పోటీ చేస్తున్నారు. 20వ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కొడుకు జైవర్ధన్ సింగ్.. గుణ జిల్లా రాఘోగఢ్, దిగ్విజయ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్.. చాచౌరా సీటు నుంచి మరోమారు అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వచ్చే నెలలో మధ్యప్రదేశ్ తోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేనెల 17న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ మూడో తేదీన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉన్నాయి.