తిరుమల : తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల( Tirumala ) మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని ( Hanuman Idol ) పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు ( Arrest ) చేశారు. బుధవారం తెల్లవారుజామున గోవిందమాల ధరించిన భక్తుడు జశ్వంత్కుమార్ హనుమంతుడి చిన్న విగ్రహాన్ని చోరీ చేసి పారిపోయాడు.
ఆలయం వద్ద అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విశాఖపట్నానికి చెందిన జశ్వంత్ కుమార్గా నిర్ధారించుకున్నారు. చోరీ అనంతరం అతను యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నట్టు సాంకేతిక ఆధారాలతో గుర్తించి వెంటనే ఒంగోలు జీఆర్పీ పోలీసులను అప్రమత్తం చేశారు.
నిందితుడిని ఒంగోలు స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి విగ్రహాన్ని తిరుమలకు తీసుకొచ్చి తిరుమల, తిరుపతి దేవస్థానం సంప్రదాయాల ప్రకారం హనుమంతుడి విగ్రహానికి పుణ్యాహవచనం చేసి పునఃప్రతిష్టించారు.