న్యూఢిల్లీ, ఆగస్టు 17: రూ. 3 లక్షల కంటే తక్కువ స్వల్పకాల వ్యవసాయ రుణాలు తీసుకునే ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2022-23 నుంచి 2024-25 మధ్య రుణాలు తీసుకునే పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ఈ స్కీమ్ వర్తిస్తుందని సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
తాజా నిర్ణయంతో సాగు రంగంలో రుణ లభ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ. 34,856 కోట్ల భారం పడుతుందన్నారు. మరోవైపు, కొవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా.. హాస్పిటాలిటీ, దాని అనుబంధ రంగాల్లో సేవలు అందిస్తున్న సంస్థలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద అందిస్తున్న రూ. 4.5 లక్షల కోట్లకు మరో రూ. 50 వేల కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.