న్యూఢిల్లీ, మార్చి 17: పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న ఢిల్లీలో దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీని ఆదేశించింది. ఆ మరుసటి రోజు రుజిరా బెనర్జీని ఈడీ ప్రశ్నించనున్నది. గతేడాది సెప్టెంబర్ 10నే ఈడీ ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఢిల్లీలో అధికారుల ముందు దర్యాప్తునకు హాజరు కాలేమని ఇద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 11న కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈడీ మళ్లీ సమన్లు పంపింది. అభిషేక్ బెనర్జీ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.