ఉస్మానియా యూనివర్సిటీ/గౌతంనగర్/మల్కాజిగిరి/వినాయక్నగర్, జూలై 2: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. శుక్రవారం తార్నాక డివిజన్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాలాపేటలో కల్వర్టును విస్తరించడంతో పాటు నాలాలను వెడల్పు చేయడం ద్వారా స్థానికుల సమస్యలను పరిష్కరించామని వివరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా తమకు అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, ఈఈ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కార్పొరేటర్ మేకల సునీతా శానిటైజేషన్ సిబ్బందితో కలిసి మిర్జాల్గూడలో డ్రైనేజీపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం పగిలిన మ్యాన్హోళ్లు, డ్రైనేజీ లీకేజీ, రోడ్లపై మురుగునీరు వంటి సమస్యలను గుర్తించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొక్కల పెంపకంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టిసారించామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక అని కార్పొరేటర్ సునీత వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటైజేషన్ అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి ఆయా ఆలయాల వద్ద పరిశుభ్రత ఉట్టిపడేలా ఉండాలని అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం మల్కాజిగిరి కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సునీల్యాదవ్, ఆవుల వినోద్యాదవ్, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్య కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం అల్వాల్ డివిజన్, మచ్చ బొల్లారం డివిజన్లలో డీసీ నాగమణి, కార్పొరేటర్లు , డీఈ మహేశ్, ఏఎంహెచ్వో నిర్మలతో కలిసి పారిశుద్ధ్య పనులతో పాటు వరద నివారణ కోసం తీసుకోవాల్సిన పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కవిత, హరిబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు ఈస్ట్ ఆనంద్బాగ్ కార్పొరేటర్ వై. ప్రేంకుమార్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాలనీలు, బస్తీల్లో అధికారులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి పర్యటించారు.