Miyapur | మియాపూర్ , మే 9 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి.. అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్యుత్ స్తంభాలు పడి పోవడంతో ప్లాట్ నంబర్ 130 -136 వరకు మూడు రోజుల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది ఎట్టకేలకు గురువారం రాత్రి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
అయితే మూడు రోజుల పాటు కరెంటు లేక నరకం చూసినట్లు కాలనీ వాసులు వాపోయారు. మరోవైపు మదీనాగూడలోని ఉషోదయ ఎన్క్లేవ్ కాలనీలోనూ గాలి వానకు చెట్లు, విద్యుత్ తీగలు పడిపోయాయి. ఇక్కడ కూడా సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు అనేకసార్లు విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులకు తమ బాధను మొర పెట్టుకున్నారు. అయితే, విరిగిన కొమ్మల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణలో రెండు శాఖలు తీవ్ర జాప్యం చేశాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాఖలకు సంబంధించిన ఫోన్లకు ఎవరూ సమాధానం ఇవ్వడంలేదని.. విద్యుత్ లేక చీకట్లో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ప్రధానంగా చిన్నారులు , వృద్ధులు, గర్భిణులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చిందని కాలనీవాసులు పేర్కొన్నారు. గత పదేండ్లలో ఇలాగా అనేకసార్లు ఈదురుగాలులు, భారీ వర్షాలు వచ్చి.. చెట్ల కొమ్మలు విరిగి.. విద్యుత్ లైన్లు తెగిపడ్డ సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని, అయితే రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనలు మాత్రం లేవని.. కాలనీకి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ నిర్వాహకుడు గుండవెల్లి ప్రణిత్ పేర్కొన్నారు. గతంలో సంబంధిత శాఖలు శ్రమించి..రాత్రికి రాత్రే విద్యుత్ను పునరుద్ధరించే పరిస్థితిని పదేండ్లలో చూశామని, ప్రస్తుతం అందుకు భిన్నంగా పనులు ఉన్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితులతో గాలివాన సహజమే అయినా …దానిని ఎదుర్కునేలా…ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం సిద్ధం లేకపోవడం వల్లే ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.