ఒకప్పుడు యాదాద్రి భువనగిరి ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? సమైక్య పాలనలో పడకేసిన ప్రగతి ఏడేండ్ల స్వపరిపాలనలో పరుగులు పెడుతుండటాన్ని చూసి యావత్ ప్రజానీకం ఆశ్చర్యపోతున్నది. ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన ఇలా సాగాలని ప్రతి వ్యక్తి కోరుకున్న విధంగానే అభివృద్ధి, సంక్షేమం నిర్విఘ్నంగా సాగింది. ‘ధరణి’ రాకతో ఏండ్లనాటి భూముల తండ్లాటలకు చెక్ పడింది. సంక్షేమ పథకాల కోసం కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. అభివృద్ధి పనుల కోసం ఎదురు చూసే పరిస్థితులు మారాయి. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ఎన్ని ప్రకృతి విపత్తులు ఏర్పడినా.. సంక్షోభ పరిస్థితులు వెంటాడినా.. సంక్షేమం, అభివృద్ధి జిల్లాలో అప్రతిహతంగా సాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత విషం చిమ్మినా.. పరిపాలనలో ఆత్మైస్థెర్యం సడలలేదు. ఏడేండ్ల పాలనలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జిల్లా అభివృద్ధిపరంగా ముందు వరుసలో నిలిచింది. పారిశ్రామిక ప్రగతితో జిల్లా కొత్త పుంతలు తొక్కుతున్నది.
– యాదాద్రి భువనగిరి, జూన్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిరాడంబరంగానే..రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
భువనగిరి కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ సునీత
కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభలు, సమావేశాలు లేకుండా ముగించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం జరిగే ఆవిర్భావ వేడుకల్లో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాలకు మాత్రమే వేడుకలు పరిమితం కానున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు గ్రామస్థాయి వరకు ఇదే రీతిలో వేడుకలు జరుగనున్నాయి. భువనగిరిలోని అమరవీరుల స్థూపం వద్ద ఉదయం 8.45 గంటలకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ అనితారామచంద్రన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్లాస్టిక్ ఫ్లాగ్లను వినియోగించవద్దని, వేడుకల్లో పాల్గొనే ప్రతిఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.
అసలు సిసలైన రైతు బాంధవుడు
వ్యవసాయ సీజన్కు ముందు పెట్టుబడులకు సీఎం కేసీఆర్ రెండు సీజన్లకు ఎకరాకు రూ.5వేల చొప్పున అందజేస్తూ రైతాంగానికి రైతు బాంధవుడిలా నిలుస్తున్నారు. 2020వానకాలంలో 2,03,509 మంది రైతులకు రూ.285.44కోట్ల పెట్టుబడి సాయం, 2020-21యాసంగిలో 2,09,380మంది రైతులకు రూ.288.93కోట్ల సాయం అందగా, ప్రస్తుత వానకాలం సాగుకు 2,23,745 మంది అర్హులుగా గుర్తించారు. వీరితోపాటు పార్ట్”బి’ నుంచి పార్ట్ ‘ఏ’లోకి మారిన 522ఖాతాలకు, ఆర్వోఎఫ్ఆర్ ఖాతాలు కలిగిన 145మందికి రైతుబంధు సాయం అందనున్నది. ఇక మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ.5లక్షల సాయం అందిస్తుండగా, జిల్లాలో 2018లో 559 మంది రైతులకు రూ.27.95కోట్లు, 2019లో 556మంది రైతులకు రూ.27.80కోట్లు, 2020లో 359మంది రైతులకు రూ.17.95కోట్లు, 2020-21లో 1,545 మంది రైతులకు రూ.73.7కోట్లు అందించారు. జిల్లాలో 2,17,783 మంది రైతులు ఉండగా, 2021-22 సంవత్సరానికి రైతుబీమాకు 1,13,002 మంది రైతులను అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వీరి ప్రీమియంకు సంబంధించిన సొమ్మును ఎల్ఐసీకి చెల్లించింది.
కరువు కష్టాల్ని తీరుస్తున్న గోదారమ్మ..