నల్లగొండ, ఏప్రిల్ 7 : సాగర్ ఎడమ కాల్వ కింద పొలాలకు సాగునీటి విడుదల, గ్రామాల్లో తాగునీటి సమస్య, రైతుబంధు అందించడంపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో రగడ జరిగింది. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. సభ్యులు పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 503 అడుగుల నీటి మట్టం ఉన్నా గత ప్రభుత్వం ఎడమ కాల్వకు నీరిచ్చిందని, ఇప్పుడు 512 అడుగులు ఉన్నా పొలాలను ఎందుకు ఎండబెడుతుందని మిర్యాలగూడ జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఎడమ కాల్వ కింద 1.50 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందన్నారు. ఖమ్మం జిల్లా పాలేరుకు నీళ్లు తీసుకెళ్తుంటే జిల్లా మంత్రులు ఎందుకు స్పందించడంలేదని, కుడి కాల్వకు రెండు, మూడు సార్లు నీళ్లిచ్చినా ఎడమ కాల్వకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఏప్రిల్లోనే తాగునీటి సమస్య ఉంటే జూన్ నాటికి ఎలా ఇవ్వగలరని చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అడిగారు. సీజన్ పూర్తయినా రైతుబంధు ఇవ్వకపోతే ఎలా అని వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు.
సమస్యలపై ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏవీరెడ్డి, పాశం రాంరెడ్డి, వంగూరు లక్ష్మయ్య ఎదురు దాడికి దిగారు. కొంత మందికి మూడెకరాలు, మరి కొంత మందికి నాలుగు, ఇంకొంత మందికి ఐదు ఎకరాల వరకు రైతు బంధు పడిందని, ప్రభుత్వాన్ని నిందించడం ఏందని అన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరుగగా.. చైర్మన్ బండ నరేందర్రెడ్డి జోక్యం చేసుకొని ఇరువురిని సముదాయించారు. జిల్లాలో 5.44 లక్షల మందికి రూ.624 కోట్లకు గాను 4.78 లక్షల మందికి రూ.433 కోట్ల రైతుబంధు పడిందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
జిల్లాలో సన్న ధాన్యం పండించిన రైతులను మిల్లర్లు నిండా ముంచారని, రైతులకు మంచి ధర అందించడంలో ప్రభుత్వం, సివిల్ సప్లయ్ యంత్రాంగం విఫలమైందని పలువురు సభ్యులు అన్నారు. ప్రధానంగా మహేంద్ర చింట్లు రకం ధాన్యానికి క్వింటాకు రూ.2100 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నీటి సమస్య మొదలైందని, ఈ రెండు నెలలు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తాగునీరు ఇవ్వాలని కోరారు. రైతులు ట్రాన్స్ఫార్మర్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఫిట్టింగ్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు.
జిల్లా స్థాయి జనరల్ బాడీకి కలెక్టర్ రాకపోవడం సరికాదని, సాగు, తాగునీటి సమస్యలు ఉంటే ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. అనంతరం చైర్మన్ బండ నరేందర్రెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్ను జిల్లా వైద్యాధికారి కొండల్రావుతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.