నల్లగొండ, అక్టోబర్ 14 : గులాబీ బాస్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసి అభివృద్ధిని నిరాటంకంగా కొనసాగించేందుకు ఉద్యమ సైనికులు సిద్ధమవుతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న చిన్న పొరపాట్లతో ఇటీవల పార్టీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ నేత చకిలం అనీల్కుమార్ ఇప్పటికే పార్టీ యువనేతను కలిసి పార్టీలోనే ఉండి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించగా.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి శనివారం జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ గెలుపునకు తాను మరోసారి కృషి చేస్తానని ప్రకటించారు. దాంతో నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. ఇదిలా ఉండగా బండ అధ్యక్షతన హైదరాబాద్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో 2001 నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమ సైనికులు ప్రత్యేక సమావేశం నిర్వహించి మరోసారి కేసీఆర్ సీఎం కావాలంటే నల్లగొండలో భూపాల్ రెడ్డిని గెలుపించుకోవాల్సిందేనని నినాదించారు. గత ఎన్నికల్లో వచ్చి న మెజార్టీ కంటే రెట్టింపు వచ్చేలా గడప గడపకూ వెళ్లి అభివృద్ధిని వివరించాలని నిశ్ఛయించారు.
పెండింగ్ పనులు పూర్తి కావాలంటే బీఆర్ఎస్సే గెలువాలని..
కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.300 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొస్తే కంచర్ల భూపాల్ రెడ్డి ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ చొరవతో రూ.1450 కోట్లు తీసుకొచ్చారు. వాటిలో ఇప్పటికే రూ.800కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి కాగా.. మరో 600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ ప్రగతిలో ఉన్న పనులు పూర్తి కావాలంటే మరోసారి నల్లగొండలో బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని, పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఉద్యమకారులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నల్లగొండ శాసన సభ్యుడిగా మరోసారి గులాబీ బాస్ కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చినందున ఆయనను 50వేల మెజార్టీతో గెలిపించాలని ప్రతిన బూనారు.
గెలుపు బాధ్యతను బండకు అప్పగించిన గులాబీ బాస్..
నల్లగొండ నియోజకవర్గం గెలుపు బాధ్యతను జడ్పీ చైర్మన్, ఉద్యమ నేత బండ నరేందర్రెడ్డికి గులాబీ బాస్ అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యమకారులను ఏకం చేసే బాధ్యతను తీసుకొని అందరికి ప్రచార బాధ్యతలు అప్పగించే పనిలోపడ్డారు. తమ ఉద్యమ నేతే ముందుండి మరోసారి మమ్మల్ని నడిపిస్తుండడంతో పాటు చకిలం అనీల్కుమార్తో పాటు చాడ కిషన్రెడ్డి మరోసారి కంచర్ల గెలుపునకు కృషి చేస్తానని ప్రకటంచిన నేపథ్యంలో ఉద్యమ సైనికుల్లో కొత్త జోష్ వచ్చింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు.