నార్కట్పల్లి, జనవరి 11: మండలంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ కార్యాలయంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే సహించేది లేదని హెచ్చరించారు.
త్వరలో ప్రభుత్వ భూముల సర్వే నిర్వహించాలని సూచించారు. మండలంలో విద్యుత్ సరఫరా సరిగా లేదని, మిషన్ భగీరథ పైప్లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పలు గ్రామాల సర్పంచ్లు సభ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే మండల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం ఈ నెలఖారున పదవీ విరమణ పొందనున్న సర్పంచ్లను సత్కరించి మెమెంటోలు అందజేసి సన్మానించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.