పాలకవీడు, జనవరి 3 : మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ్రామ శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఉండగా పాలకవీడుకు చెందిన పగడాల జ్యోతిబసు అనే యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో జ్యోతిబసు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్లో కామినేనిలో చికిత్సపొందుతున్నాడు.
ప్రమాదంపై జ్యోతిబసు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు జనవరి 1న నాగుల్మీరాను స్టేషన్కు పిలిపించి విచారించగా ప్రమాదానికి తాము కారణంకాదని, పాలకవీడుకు చెందిన వ్యక్తులే జ్యోతిబసును ఢీకొట్టి వెళ్లిపోయారని పేర్కొన్నాడు. గాయపడిన వ్యక్తి కుటుంబసభ్యులు పరిహారం కోరడం, పోలీసులు విచారించడంతో మనస్తాపంతో నాగుల్ మీరా మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.
పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన
నాగుల్మీరా మృతదేహంతో అతడి తల్లిదం డ్రులు, కుటుంబసభ్యులు పాలకవీడులోని పోలీస్సేష్టన్ ఎదుట ఆందోళనకు దిగారు. నాలుగు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐలతో చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు వివరాలను పరిశీలించి న్యాయం చేస్తామని డీఎస్పీ హమీ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులుగౌడ్ పేర్కొన్నారు.