రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తోపాటు పంట పెట్టుబడికి రైతు బంధు సాయం అందిస్తున్నది. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా వానకాలం, యాసంగికి రెండు సీజన్లలో రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటివరకు తొమ్మిది సీజన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 9,83,059 మంది రైతులకు రూ.9,294.25 కోట్లు అందాయి. ఈ నెల 28 నుంచి పదో విడుత సాయానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటల సాగుకు రైతులు ఇప్పటికే సాగు పనులు మొదలు పెట్టారు. నారుమడి వేసి పొలం దున్నే పనిలో ఉన్నారు. పదో విడుత కింద ఉమ్మడి జిల్లాలో రైతు బంధు సాయం 1205.44 కోట్లు అందనున్నాయి.
– సూర్యాపేట, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు దేశానికి అన్నం పెట్టే రైతాంగం పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. నీళ్లు లేక, విద్యుత్ రాక అన్నదాత అనేక అవస్థలు పడేది. ఉన్న భూమిలో కొద్దోగొప్పో సాగు చేద్దామనుకుంటే ఎరువులు, విత్తనాల కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. నాడు వర్షాలు వస్తున్నాయంటే రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టేది. నగలను తాకట్టు పెట్టడం.. భూమి తనఖా పెట్టడం చేసేది. ఇంత చేసి పంట పండిస్తే చివరకు అప్పులే మిగిలేవి. అందుకే అప్పట్లో రైతుల ఆత్మహత్యలు ప్రధాన శీర్షికలో వార్తలుగా కనిపించేవి. ఇప్పుడా పరిస్థితి మారింది. సాగుకు పుష్కలంగా నీళ్లు.. నిరంతర ఉచిత విద్యుత్.. సీజన్ ప్రారంభానికి ముందే ఎరువులు, విత్తనాలు ఇలా అన్నీ సకాలంలో అందుతున్నాయి. అన్నింటికీ మించి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు ఆసరాగా నిలుస్తున్నారు.
– సూర్యాపేట, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
త్వరలోనే యాసంగి పెట్టుబడి..
ఈ యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం త్వరలోనే అందజేస్తామని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు ఈ నెల 28నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ప్రస్తుతం పూర్తయిన వానకాలానికి సంబంధించి నల్లగొండ జిల్లాలో 4,82,407 మంది రైతులకు రూ.602.50 కోట్లు రైతుబంధు స్కీం ద్వారా నేరుగా వారి అకౌంట్లలో పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో 2,67,191 మంది రైతులకు రూ.309.84 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,33,461 మంది రైతులకు రూ.293.10 కోట్లు అందాయి. ఈ యాసంగికి కూడా వానకాలంలో అందిన నగదు మొత్తం ఇవ్వనున్నారు. ఇప్పటికే సీఎం ప్రకటించినందున ఈ వారంలోనే రైతుబంధు సాయం అందే అవకాశమున్నది. వ్యవసాయానికి ఇంతటి సాయం అందిస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను జీవితకాలం కడుపులో పెట్టుకొని చూసుకుంటామని రైతాంగం గర్వంగా చెబుతున్నది.
నాలుగున్నరేండ్లుగా పెట్టుబడి సాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం ప్రారంభించగా.. తొలుత ఎకరానికి రూ.4వేల చొప్పున అందజేశారు. తర్వాత సీజన్కు మరో వెయ్యి పెంచి రూ.5వేలు ఇచ్చారు. దాంతో రైతులకు సాగు పెట్టుబడికి అప్పులు తెచ్చే తిప్పలు తప్పాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచి అన్నపూర్ణగా వెలుగొందుతున్నది. రైతుబంధు పథకం ద్వారా నాలుగున్నరేండ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులకు రూ.9,294.25 కోట్లు అందజేశారు.
ఏటా రెండు సార్లు పెట్టుబడి సాయం రూపంలో నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. దాంతో రైతులు ఎలాంటి టెన్షన్ లేకుండా సంతోషంగా సాగులోకి దిగుతున్నారు. నాలుగున్నరేండ్లలో 9 సీజన్లకు నల్లగొండ జిల్లాలో 4.82 లక్షల మంది రైతులకు రూ.4,656.38 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2.67 లక్షల రైతులకు రూ.2,417.57 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.33 లక్షల రైతులకు రూ.2,220.30 కోట్లు అందజేశారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,294.25 కోట్ల రూపాయలు రైతులకు అందాయి.
పండుగ వాతావరణంలో వ్యవసాయం
గతంలో వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో సాగు పండుగలా మారింది. సీజన్కు ముందుగానే పంట పెట్టుబడి కోసం అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. ఆ పెట్టుబడితో సంతోషంగా వ్యవసాయం చేస్తున్నాం. దానికితోడు 24గంటల ఉచిత విద్యుత్, రెండు పంటలకు సరిపోను సాగు నీరు ఇస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం.
– కాటా కోటిరెడ్డి, రైతు, రావిపహాడ్, పాలకవీడు మండలం
రైతుబంధుతో పెట్టుబడి బాధలు తప్పినయి
నాకు మూడెకరాల భూమి ఉంది. వరి పంట వేస్తున్నా. గతంలో పెట్టుబడి కోసం వ్యాపారుల చుట్టూ తిరిగేది. ఎంత వడ్డీ అయినా అప్పు తెచ్చేది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుతో ఇప్పుడా బాధలు తప్పినయి. అప్పులు తీసుకురాకుండానే పెట్టుబడి ఖర్చులు వెళ్తున్నాయి. దీంతోపాటు పంటకు మద్దతు ధర అందుతుండడంతో నేడు వ్యవసాయం లాభసాటిగా కొనసాగుతుంది. రైతుబంధు పథకం వరం లాంటిది.
– బత్తుల సురేశ్, రైతు, చిల్పకుంట్ల, నూతనకల్ మండలం
రైతుల కష్టాలు తీరినయ్
నాకు మా గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. గతంలో నీళ్లు, ఎరువులు, కరెంట్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పంట పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయించి నష్ట పోయేవాళ్లం. అప్పులు చేయలేక కొంత మాత్రమే సాగు చేసేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల కష్టాలు తీరినయ్. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో పంట పెట్టుబడులకు అప్పులు చేయడమే మర్చిపోయినం. ఇప్పుడు రైతు బంధు సాయంతో రెండున్నర ఎకరాలు సాగు చేస్తున్నా. రైతుల కష్టాలను తీర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– యలగొండ నాగేశ్వర్రావు, రైతు, సిరిపురం, నడిగూడెం మండలం