జిల్లాలో యాసంగి సాగు పనులు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో రైతులు వ్యవసాయం పనుల్లోనిమగ్నమయ్యారు. ప్రస్తుతం వరి ధాన్యానికి డిమాండ్ ఉన్న నేపథ్యంలో యాసంగిలోనూ దానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సాగు విస్తీర్ణం కొంత తగ్గనున్నది. గతేడాది 3,10,165 ఎకరాల్లో వరి వేయగా ఈ సంవత్సరం 2,61,150 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఇప్పటికే పలుచోట్ల దుక్కిదున్నడం చేపడుతుండగా మరికొన్ని చోట్ల వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో మరింత ఊపందుకోనున్నాయి. మన దగ్గర సాగు పనులు పుష్కలంగా ఉండడంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. మరోవైపు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. దాంతో సాగుకు ఇబ్బందులు తప్పడం లేదు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనుల్లో రైతులు బిజీ అయ్యారు. అధిక శాతం మంది ట్రాక్టర్లతో దున్నుతున్నారు. కూలీలను రప్పించి నాట్లు వేయిస్తున్నారు. ఇప్పటికే వలిగొండ, పోచంపల్లి, రామన్నపేట, రాజాపేట, బీబీనగర్ మండలాల్లో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2,61,150 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 2,40,500 ఎకరాల్లో వరి వేయనున్నట్లు భావిస్తున్నది. ఆ తర్వాత 150 ఎకరాల్లో మిల్లెట్లు, 150 ఎకరాల్లో పప్పుదినుసులు, 250 ఎకరాల్లో ఆయిల్ సీడ్, 20,100 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, పుష్కలంగా విత్తనాలు, ఎరువులు, రసాయనాలు అందుబాటులో ఉండేవి. దాంతె రైతులు సైతం పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ముందుకు వచ్చేవారు. కానీ, ఈ సారి సాగు తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. గతేడాది కంటే 49 వేల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం ఉందని ప్రణాళికలో పేర్కొన్నారు. సాగు తగ్గడానికి నీటి కొరత, సరిపడా వర్షాలు రాకపోవడమే కారణమని తెలుస్తున్నది.
మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీతతో ఎక్కడ చూసినా జలకళ సంతరించుకున్నాయి. రైతుబంధు సాయంతో కూలీలంతా సొంతంగా వ్యవసాయం చేసుకున్నారు. మరికొందరు భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. సాగుకు మరికొంత మంది అవసరం కూడా పడు తుండటంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. దాంతో ఇతర రాష్ర్టాల కూలీలు మన దగ్గరకు వలస వస్తున్నారు. కూలి తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ పని చేస్తుండటంతో వారిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా రాజాపేట, పోచంపల్లి, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.
నాటి సర్కారు వ్యవసాయ పెట్టుబడి కోసం అడకగముందే డబ్బులు ఖాతాల్లో జమ చేసి ఆదుకునేది. ఎరువుల కొనుగోలు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల కోసం సీజన్కు ఎకరానికి రూ.5వేల సాయం చేసింది. ఏటా ఎకరానికి రూ.10వేలు అందించింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏటా ఎకరాకు రూ.15 వేల సాయం చేస్తామని హామీ ఇచ్చినా పాత పద్ధతిలోనే ఇస్తామని ప్రకటించింది. యాసంగి సీజన్లో జిల్లాలో 2,71,590 మందికి రూ.304,78,45,790 సాయం అందించాల్సి ఉంది. కానీ, జిల్లాలో 10 శాతం లోపు మందికి కూడా రైతుబంధు జమకాలేదు. దాంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు.