నల్లగొండ, జనవరి 18 : యాసంగి సాగు ప్రణాళిక గాడి తప్పుతున్నది. గడిచిన తొమ్మిదేండ్లుగా రెండు సీజన్లలో పచ్చని పంటలు పండగా ఈ సారి వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ శాఖ అంచనాలు మారుతున్నాయి. యాసంగి సీజన్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు 2.99 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యింది. ఈ నెల చివరి నాటికి యాసంగి సీజన్ ముగియనున్న నేపథ్యంలో మరో 50వేల ఎకరాలకు మించి సాగు అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీ
నికి కారణం సాగర్ ప్రాజెక్టులో నీరు లేనందున ఎడమ కాల్వతోపాటు ఏఎంఆర్పీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీటి కిందనే మెజారిటీ సాగు భూములు ఉండగా అక్కడక్కడ బోర్లు ఉన్న రైతులతోపాటు నాన్ ఆయకట్టు రైతులు సాగు చేయడంతో ఆ మాత్రం పంటలు సాగు అవుతున్నాయి. ప్రస్తుతం బోర్లలో కనీస నీటి నిల్వలు ఉండగా పొట్ట దశలో ఆ నీళ్లు ఏ మేరకు సరిపోతాయోనని అన్నదాతలు ఆందోళనలో చెందుతున్నారు.
యాసంగి సీజన్లో సాగు అంచనాలు తగ్గడానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేక పోవడమే కారణం. వర్షాభావ పరిస్థితులతో చెరువులు కూడా నిండలేదు. దాంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. నాగార్జున సాగర్తోపాటు ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎంఆర్పీ కింద ఎక్కువగా వరి సాగు చేస్తారు. సాగర్ ఎడమకాల్వ కింద 1.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ సారి బోరు బావులను నమ్ముకొని 30వేల ఎకరాలకు మించి సాగు చేయని పరిస్థితి.
2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఏఎంఆర్పీ హైలెవల్, లోలెవల్ ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు లేవని, నీటిని విడుదల చేయలేమని అధికారులు ఇప్పటికే ప్రకటిచండంతో అక్కడా సగం మేర మాత్రమే సాగు అవుతున్నాయి. ఏఎంఆర్పీ ప్రాజెక్టు పరిధిలో ఎక్కువగా బోర్లు ఉండటం వల్ల సాగు చేస్తున్నప్పటికీ చివరి పొలాల వరకు నీళ్లు పారుతాయా లేదోనని ఆందోళనలో రైతాంగం ఉన్నది. ఇక మూసీ కింద మాత్రం 30వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నది.
సాధారణంగా యాసంగి సీజన్ నవంబర్-15 నుంచి ప్రారంభం అయినప్పటికీ మార్చి లేదా ఏప్రిల్ నాటికి పంట చేతికి వస్తుంది. ఈ సారి మరో పది రోజులైతే జనవరి నెల పూర్తి అవుతున్నా జిల్లా వ్యాప్తంగా 5.81 లక్షల ఎకరాలకు 2.99 లక్షల ఎకరాలు మాత్రమే సాగు అయ్యింది. సాగు ప్రణాళిక ప్రకారం 5.55 లక్షల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో వేరుశనగ, ఆరు వేల ఎకరాల్లో జొన్న, మొక్క జొన్న, ఆముదం, మినుము, బొబ్బర, పెసర పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇప్పటి వరకు 2.79లక్షల ఎకరాల్లో వరి, 16వేల ఎకరాల్లో వేరుశనగ, నాలుగు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. ఈ నెల చివరి నాటికి 60శాతం మాత్రమే సాగయ్యే అవకాశం ఉన్నది.
నల్లగొండ జిల్లాలో 651.4 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 530.4 మిల్లీమీటర్లు పడింది. 18.6శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలో 32 మండలాలకు గానూ 28 మండలాల్లో సాధారణ వర్షపాతం పడగా 14 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నది. ప్రస్తు తం 32 మండలాల్లో భూగర్భ జలాలు పడిపోతుండగా మరో రెండు నెలల్లో అడుగంటిపోయే పరిస్థితి కనిపిస్తున్నది.
ఈ సారి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేనందున ఆ నీటిపై ఆధార పడ్డ రైతులు సాగు చేయడం లేదు. బోరు బావులపై ఆధార పడ్డ రైతులు మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరి వేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు లక్షల ఎకరాల్లో పంటల సాగు కాగా ఈ నెల చివరి నాటికి పెరిగే అవకాశం ఉన్నది.
– శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ