నల్లగొండ, ఫిబ్రవరి 4 : జనవరి-31తో యాసంగి సాగు ప్రణాళిక ముగిసింది. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.01లక్షల ఎకరాల్లోనే (83శాతం) సాగు అయ్యింది. ఇందులో అత్యధికంగా వరి 3,79,696 ఎకరాలు, వేరుశనగ 17,715, జొన్న 1,069, పెసర 1,684, మొక్క జొన్న, ఆముదం, మినుము, బొబ్బర 1,100 ఎకరాల్లో సాగవుతున్నాయి. గడిచిన తొమ్మిదేండ్లుగా సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగగా ఈ సారి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అంచనాలు తప్పాయి.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు లేనందున ఎడమ కాల్వతో పాటు ఏఎంఆర్పీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు సాగులోకి రాలేదు. వీటి కిందనే మెజారిటీ సాగు భూములు ఉండగా అక్కడక్కడ బోర్లు ఉన్న రైతులతో పాటు నాన్ ఆయకుట్టు రైతులు సాగు చేయటంతో ఆ మాత్రం పంటల సాగు అవుతున్నది. ప్రస్తుతం బోర్లలో రోజురోజుకూ నీటి లభ్యత తుగ్గుతుండటంతో పొట్ట దశలో నీరు ఏ మేరకు సరిపోతుందోనని రైతులు ఆందోళనలో చెందుతున్నారు.
జిల్లాలో వానకాలంతోపాటు యాసంగి సీజన్లోనూ వరి పైరునే ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడ నాగార్జున సాగర్తోపాటు ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏఎంఆర్పీ కింద ఎక్కువగా వరి వేస్తారు. సాగర్లో ఎడమకాల్వ కింద 1.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ప్రాజెక్టులోనీరు లేనందున ఈ సారి బోరు బావులను నమ్ముకొని 30వేల ఎకరాలకు మించి సాగు చేయలేదు. 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఏఎంఆర్పీ హైలెవల్, లోలెవల్ ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు లేవని, నీటి విడుదల చేయలేమని అధికారులు ప్రకటించడంతో సగం మేర మాత్రమే సాగు చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఎక్కువగా బోర్ల ద్వారానే పంటలు పండిస్తున్నారు. పంటల చివరి వరకు నీరు సరిపోతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాల్లో వరి సాగు అవుతున్నది.
జిల్లాలో గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు సరిపడా వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు నిండలేదు. దాంతో బోర్లు, బావుల్లో నీటి మట్టం తగ్గుతున్నది. జిల్లాలో 14 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు నెలలు పోతే ఆయా మండలాల్లో నీటి నిల్వలు బాగా తగ్గే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.