యాదగిరిగుట్ట, జూన్7: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, బస్టాండ్, శివాలయం భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనానికి 4 గంటలు, వీవీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సుమారు 92 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తెల్లవారు జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు.
అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ అర్చకులు హోమం జరిపారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది.
ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రంవేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు.
రాత్రివేళలో స్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 73,75,642 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్ తెలిపారు. స్వామివారిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.