యాదగిరిగుట్ట, మార్చి14: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సెలవుదినం కావడంతో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తిరుమాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, బస్టాండ్, శివాలయం, వ్రతమండపం భక్తులతో నిండిపోయింది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటలు, వీవీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. తెల్లవారు జామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపి స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. స్వామి, అమ్మవార్లతోపాటు క్షేత్రపాలకుడికి సహస్రనామార్చన చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం జరిపారు. ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు మాడవీధుల్లో సువర్ణమూర్తులను బంగారు పుష్పాలతో అర్చించారు.
సాయంత్రంవేళలో శ్రీస్వామివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రివేళలో శ్రీస్వామి, అమ్మవార్లకు తిరువారాధన, సహస్రనామార్చన, శయనోత్సవ సేవలు శాస్ర్తోక్తంగా జరిగాయి. పాతగుట్ట స్వామివారికి ఆర్జిత సేవలు అత్యంత వైభవంగా సాగాయి. ఉద యం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానకు రూ. 34,24,189 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశికధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్ తెలిపారు.