యాదాద్రి, జనవరి 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దేవస్థానం ఆధ్వర్యంలో మరో 240 గదులు అందుబాటులోకి వచ్చినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట కొండకింద తులసీకాటేజీ వద్ద దాతల సహకారంతో రూ. 21 కోట్లతో నిర్మించిన 240 అద్దె గదుల భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్భాస్కర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భవనంలో చేపట్టిన సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మంత్రులు మాట్లాడుతూ ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనమిచ్చినట్లు వెల్లడించారు. దాత సాయంతో కొండకింద సదనాలు, కాటేజీలను భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు.
యాదాద్రి ప్రధానాలయాన్ని భక్తులు గర్వపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారన్నారు. ఎక్కడాలేని విధంగా పూర్తి కృష్ణశిలలతో వివిధ దేవతామూర్తులు, ఆకృతులను నిర్మించిన ఆలయాన్ని మనసారా చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ఏఈఓలు గట్టు శ్రవణ్కుమార్, సూపరింటెండెంట్ రాజన్బాబు, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ అనూరాధ పాల్గొన్నారు.
దేవస్థాన డైరీ ఆవిష్కరణ
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 డైరీని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం యాదాద్రి కొండపైన వీవీఐపీ అతిథి గృహంలో నూతన డైరీని ఆవిష్కరించి పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, చీఫ్ విప్ ధాస్యం వినయ్భాస్కర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, ఆలయ అధికారులు రామ్మోహన్, విజయ్, హరిత హోటల్ మేనేజర్ జంగయ్య పాల్గొన్నారు.