యాదగిరిగుట్ట, డిసెంబర్28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 23న ప్రారంభమైన ఆధ్యయనోత్సవాలు గురువారం పరిపూర్ణమయ్యాయి. నిత్యారాధనలు అనంతరం లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి ఆళ్వారుల ముందు ప్రబంధ పారాయణాలను పఠించి, భక్తుల దర్శనార్థం తిరుమాఢ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు పాంచరాత్రగమ సంప్రదాయ రీతిలో వైభవంగా జరిపారు. అనంతరం అధ్యయనోత్సవాలకు విచ్చేసిన దివ్య ప్రబంధ పారాయణికులను ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా గుట్ట ప్రధానాలయంలో తిరుప్పావై పూజలను వైభవంగా చేపట్టారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను అర్చకులు పఠించారు.