యాదగిరిగుట్ట, జూన్ 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం ఎటుచూసినా భక్తులే కనిపించారు. మాఢవీధులు, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనానికి భక్తులు గంటల కొద్ది క్యూలో నిలుచున్నారు. కొండ కింద పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది. స్వామివారి ధర్మ దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు ఘనంగా జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్భార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.54,84,992 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.