గుట్టలో లక్ష్మీనరసింహ స్వామికి శుక్రవారం నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారు జూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు దర్శనబాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాల ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాలు పేరిట సంకల్పం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవ మూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతును జరిపారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవను, ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి తిరువరాధన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 9 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.16,09,975 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామ కృష్ణారావు తెలిపారు.