యాదగిరిగుట్ట, మార్చి14 : ఉదయం వటపత్రశాయిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావాహ్నిక, పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో జరుగుతున్నాయి. ప్రధానాలయంలో గురువారం వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం తదితర పూజలను ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞికులు, రుత్వికులు, పారాయణందారులు నిర్వహించారు. అనంతరం ఉదయం 9.00 గంటలకు స్వామివారిని వంటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. రుత్వికులు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్ర జప పఠనాలు గావించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు స్వామివారిని తూర్పు మాఢవీధుల్లో ప్రత్యేక వేంచేపు మండపంలో ఆస్థానం చేసి ప్రధానార్చకులు వటపత్రశాయి విశిష్టతను భక్తుల వినిపించారు.
దేవ దేవుడు తన మనోనేత్రంతో లోకంలోని మంచి, చెడులను వేరు చేసే విధానికి ప్రతీకగా.. పాలను, నీటిని వేరు చేయగల హంస దివ్యవాహనంపై నరసింహ స్వామి భక్త జనులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు నిత్యకైంకర్యాల అనంతరం ప్రధానాలయంలోని కల్యాణ మండపంలో స్వామివారిని హంస వాహనంపై అధిష్టింపజేసి ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. ఇతిహాసంలో, వేద శాస్త్రంలో హంసను జ్ఞానానికి ప్రతీకగా పేర్కొన్నారు. హంస శాంతికి, కీర్తికి, ఆనందానికి, అందానికి దిక్చూచి. హంస పక్షి జాతికి చెందినా భగవదనుగ్రహ విశేషం వల్ల రాజహంసగా పరమాత్మ వాహనంగా యోగ్యతను కలిగి ఉన్నదని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రఘు, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న నిర్వహించే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవానికి కల్యాణ వేదిక ముస్తాబువుతున్నది. ప్రధానాలయం ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిఫ్ట్, రథశాల ప్రాంతంలో కల్యాణ వేదికతోపాటు 3,500 మంది కూర్చునే విధంగా వీవీఐపీ, వీఐపీ, మీడియా, దాతలు, దేవస్థాన అధికారులు, డోనర్లు, కల్యాణంలో పాల్గొనే భక్తులకు వేర్వేరుగా ప్రత్యేకమైన లాబీలను ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణ వేదికను 3 ఫీట్ల ఎత్తు, 42 వెడల్పు, 80 పొడవుతో తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని 10 వేల మంది వీక్షించే విధంగా కొండపైన 8 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక ప్రాంతంలో 4, తూర్పు మాఢవీధుల్లో ఒకటి, క్యూ కాంఫ్లెక్స్ పైన ఒకటి, కొండపైన బస్టాండ్ ప్రాంతంలో 2 ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చనున్నారు.
బ్రహ్మోత్సవాలు తిలకించే భక్తులకు దేవస్థానం భోజన వసతి కల్పించనున్నది. ఇప్పటికే కొండకింద లక్ష్మీపుష్కరిణి చెంతన దీక్షాపరుల మండపంలో రోజుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయగా బ్రహ్మోత్సవాలు సందర్భంగా 1500 మందికి అందించనున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం నేటి నుంచి ఈ నెల 21వరకు భక్తులకు అందుబాటులో ఉండనున్నది.
సృష్టి ఆదిలో మహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయి అలంకారం. మహాకల్ప ముందు ప్రపంచమంతా జలమయమై, అంధకారమై ఉన్న సమయంలో భగవానుడు మర్రి ఆకుపై పవళించి తన గర్భంలోని లోకాలన్నింటికీ తన పాదారవిందం చేత అమృతాన్ని అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వం ఈ అలంకార సేవలో దర్శించవచ్చని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
‘కరారవిందేన పదారవిందం..పదారవిందం ముఖారవిందేనె విని వేశయంతు వటస్య పత్రస్య సుఖేశయానం.. బాల ముకుందం మనసాస్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి చెప్పిన విషయాలను ఆయన వివరించారు. ఈ లీలలో సమస్త చరాచర సృష్టి మండలాన్ని నిర్మించే తీరు దర్శించవచ్చని తెలిపారు.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులను అలరించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి 19 వరకు ధార్మిక సాహిత్య, సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈశాన్య మాఢ వీధుల్లోని క్యూ లైన్ పక్కన తాత్కాలిక వేదికను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాత భేరీ, నేటి నుంచి 20వ తేదీ వరకు ఆస్థానం వారిచే మంగళవాయిద్యం, వైదిక ప్రార్థనలు ఉంటాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహ స్వామి శ్రీకృష్ణాలంకరణ సేవలో (మురళీకృష్ణుడు) భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయం త్రం పొన్నవాహన సేవలో ఊరేగనున్నారు.