న్యూఢిల్లీ, ఆగస్టు 15: పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.335.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.180.35 కోట్లతో పోలిస్తే 86 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో రూ.11,341.89 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది ఇది రూ.8,779 కోట్ల ఆదాయాన్ని గడించింది. దీంట్లో వంటనూనెల వ్యాపారంతో సంస్థకు రూ.8,504 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే ఎఫ్ఎంసీజీ వర్టికల్ రూ.2,937.74 కోట్లు ఆదాయం లభించించింది. ప్రస్తుతం సంస్థ వంటనూనెలు, ఎఫ్ఎంసీజీ, పవన విద్యుత్తు రంగాల్లో సేవలు అందిస్తున్నది. మరోవైపు, 2025-26 ఆర్థిక సంత్సరానికిగాను కంపెనీ రూ.40,347.78 కోట్ల ఆదాయంపై రూ.1,814.47 కోట్ల నికర లాభాన్ని గడించింది.