యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. గురువారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో నారసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామివారికి నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గంటన్నరపాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా కల్యాణతంతు జరిపారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు నిర్వహించారు. స్వామివారి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠా మూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలిపి ఖజానాకు రూ.20,52,092 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
పాతగుట్ట లక్ష్మీనరసింహుడికి భువనగిరికి చెందిన శ్రీకాంత్చారి, లక్ష్మి దంపతులు యజ్ఞోపవీతం బహూకరించారు. 270 గ్రాముల వెండికి గ్రాము బంగారు తాపడంతో కూడిన యజ్ఞోపవీతాన్ని గురువారం పాతగుట్ట ఆలయంలో డీఈఓ దోర్బాల భాస్కర్శర్మకు అందజేశారు.